Somireddy Chandra Mohan Reddy: జగన్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది: సోమిరెడ్డి

  • వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందన్న సోమిరెడ్డి  
  • జగన్, షర్మిల, విజయమ్మ పాదయాత్రలను టీడీపీ ఏనాడూ అడ్డుకోలేదని వ్యాఖ్య
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందన్న సోమిరెడ్డి  
somireddy fires on cm jagan

వైఎస్ జగన్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగ్గంపేట, పెద్దాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన స్పందన జీర్ణించుకోలేకనే అనపర్తిలో అడ్డంకులు సృష్టించారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలందగ్గర పడింది కాబట్టే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ లో నియంతృత్వ, నిరంకుశ, దుర్మార్గపు పాలన కొనసాగుతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్, ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పాదయాత్రలు చేసినా, కార్యక్రమాలు నిర్వహించుకున్నా ఏనాడూ అడ్డంకులు సృష్టించలేదని చెప్పారు. రోడ్లపై అడ్డంగా నిలబడి ప్రశాంత్ కిషోర్ రాసిచ్చిన పచ్చి అబద్ధాలు చెప్పినా.. టీడీపీ హయాంలో పోలీసులు వారిని అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు.

నియంత పాలన సాగిస్తున్న జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందని అన్నారు. ప్రజలను ఉద్దేశించి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సోమిరెడ్డి నిలదీశారు. ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు.

More Telugu News