Andhra Pradesh: ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రేపే ప్రాథమిక రాత పరీక్ష.. పరీక్ష కేంద్రానికి వీటిని తీసుకెళ్లొద్దు!

  • మొత్తం 291 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
  • ఉదయం 10 గంటలకు పేపర్-1, మధ్యాహ్నం 2.30కు పేపర్-2 పరీక్ష
  • నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి నో ఎంట్రీ
  • ఈ రోజే వెళ్లి పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలన్న అధికారులు
SI Exam Held Tomorrow in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాలకు రేపు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం మొత్తం 291 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 

అలాగే, మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్‌వాచ్, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, చార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఇలాంటి వాటితో పరీక్ష కేంద్రానికి రావొద్దని, అక్కడ భద్రపరిచే సదుపాయం కూడా ఉండదని పేర్కొన్నారు. 

అభ్యర్థులు నేడే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, ధ్రువీకరించుకోవాలని, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగు లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలని పోలీసు నియమక మండలి స్పష్టం చేసింది. కాగా, మొత్తం 411 పోస్టులను భర్తీ చేయనుండగా.. ఒక్కో పోస్టుకు 418 మంది పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు 1,71,936 మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

More Telugu News