Team India: ఢిల్లీ టెస్టు కోసం కఠోర సాధన చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు... ఫొటోలు ఇవిగో!

  • భారత్-ఆసీస్ మధ్య 4 టెస్టుల సిరీస్
  • రేపటి నుంచి రెండో టెస్టు
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • మరో విజయంపై కన్నేసిన టీమిండియా
  • నెట్స్ లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు
Team India players intense practice for second test against Australia

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా రేపు రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి ముందంజ వేసిన టీమిండియా... ఢిల్లీ టెస్టులోనూ నెగ్గి ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది. అందుకే ఉదాసీనతకు తావివ్వకుండా, టీమిండియా ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. ప్రధాన ఆటగాళ్లందరూ ప్రాక్టీసు సెషన్ లో పాల్గొన్నారు. 

కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్ నెట్స్ లో ఎక్కువ సమయం ప్రాక్టీసు చేయగా, ఛటేశ్వర్ పుజారా కోచ్ రాహుల్ ద్రావిడ్ తో బ్యాటింగ్ గురించి చర్చిస్తూ దర్శనమిచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ప్రాక్టీసు చేస్తూ హుషారుగా కనిపించాడు. స్పిన్ ఆల్ రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్ ప్రాక్టీసు చేశారు. 

ఇక, గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ కూడా నెట్స్ లో బ్యాట్ పట్టడం శుభపరిణామం. రేపటి టెస్టులో అయ్యర్ కు స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల సూపర్ బౌలింగ్ చేస్తున్న యువ పేసర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో చెమటోడ్చాడు.

More Telugu News