Chandrababu: రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ... చంద్రబాబు స్పందన

  • పూర్తిగా వెండితో చేసిన నాణెం
  • ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్ణయం
  • సంతోషకరమైన విషయమన్న చంద్రబాబు
  • ఇది ఒక మైలురాయి అంటూ పురందేశ్వరి ట్వీట్
Chandrababu opines on NTR image on Rs 100 coin

మహానటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆయన బొమ్మను రూ.100 నాణెంపై ముద్రించాలని నిర్ణయించడం తెలిసిందే. ఇది ప్రత్యేకంగా తయారుచేసిన వెండినాణెం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక విజ్ఞప్తితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. రూ.100 వెండినాణెంపై టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. తెలుగు వారందరికీ ఇది గర్వకారణం అని పేర్కొన్నారు. 

అటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ అంశంపై స్పందించారు. నందమూరి తారక రామారావు గారి బొమ్మ 100 రూపాయల నాణెంపై ముద్రిస్తున్నారని, ఈ విషయంలో మింట్ అధికారులతో భేటీ జరిగిందని వెల్లడించారు. శతజయంతి ఉత్సవాల వేళ ఇది ఒక మైలురాయి అని అభివర్ణించారు. నన్ను అనుగ్రహించిన భగవంతుడికి, నన్ను ఆశీర్వదించిన నా తండ్రికి, అన్ని విధాలా సహకారం అందించిన నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు అని వెల్లడించారు.

More Telugu News