Kukatpally: కూకట్‌పల్లి బస్సుల దగ్ధం వెనక అసలు కారణం ఏమిటంటే..!

Driver Set Fire To Bharathi Travels Buses for Assulting Him
  • డ్యూటీకి రానన్న డ్రైవర్‌ను గదిలో బంధించి బెల్టుతో చితకబాదిన యజమాని
  • ప్రతీకారంగా బస్సుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన డ్రైవర్
  • నిందితుడి ఫిర్యాదుతో బస్సు యజమాని, మరో వ్యక్తిపైనా కేసు
కూకట్‌పల్లిలో ఈ నెల 12న అర్ధరాత్రి పార్క్ చేసిన మూడు బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డ్యూటీకి రానన్న డ్రైవర్‌‌ను యజమాని చితకబాదినందుకు ప్రతీకారంగా ఈ ఘటన జరిగినట్టు తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి రంగధాముని చెరువు కట్ట దిగువన భారతీ ట్రావెల్స్ గ్యారేజీలో నిలిపి ఉంచిన 3 బస్సులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా కాలి బూడిదయ్యాయి. ఈ గ్యారేజీలో నిత్యం 11 బస్సులు పార్క్ చేసి ఉంటాయి. 

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన పసుపులేటి వీరబాబు (34) రెండు నెలలుగా బస్సుల యజమాని కృష్ణారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సిందిగా కృష్ణారెడ్డి ఆదేశించారు. అయితే, తాను ఊరికి వెళ్తున్నానని, డ్యూటీకి రానని వీరబాబు చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి తన సోదరుడి కుమారుడైన యశ్వంత్‌రెడ్డితో కలిసి వీరబాబును ఓ గదిలో బంధించి బెల్టు, కొబ్బరిమట్టతో దాడిచేశాడు. 

దీంతో వారిపై పగ పెంచుకున్న వీరబాబు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యారేజీకి వెళ్లి ఓ బస్సుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. ఆ మంటలకు పక్కనే ఉన్న రెండు మినీ బస్సులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరబాబును అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం తెలిసింది. నిందితుడు వీరబాబు ఫిర్యాదుతో బస్సుల యజమాని కృష్ణారెడ్డి, యశ్వంత్‌రెడ్డిపైనా కేసు నమోదైంది.
Kukatpally
Bus Fire
Crime News
Bharathi Travels

More Telugu News