Palani: పళని మురుగన్ ఆలయంలో నటి సమంత పూజలు

  • హారతి కర్పూరం వెలిగించి మెట్ల మార్గంలో వెళ్లిన సమంత
  • తోటి నటులు, దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కలసి స్వామి దర్శనం
  • మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న నటి
Samantha visits Palani Murugan temple amid Myositis recovery

నటి సమంత ఆధ్యాత్మిక బాటలో ప్రయాణిస్తోంది. ఇటీవలే మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడినట్టు ప్రకటించిన సమంత చికిత్సతో చాలా వరకు కోలుకుంది. కోలుకుందనడానికి నిదర్శనంగా జిమ్ లో మళ్లీ కసరత్తులు చేస్తున్న వీడియోని విడుదల చేసింది. మయోసైటిస్ వ్యాధిలో కండరాల నొప్పులు వేధిస్తాయి. సమస్య నుంచి ఉపశమనం రావడంతో తిరిగి సమంత సినిమా చిత్రీకరణల్లో పాల్గొననుంది. ఈ క్రమంలో తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సోమవారం దర్శించుకుంది.

ఆలయంలో స్వామి వారిని చేరుకోవడానికి 600 మెట్లు ఉంటాయి. మెట్ల మార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ప్రతీ మెట్టుపై హారతి కర్పూరం వెలిగించి నడుచుకుంటూ వెళ్లింది. పళని మురుగన్ ను అరుళ్మిగు దండయుతపాణి స్వామి అని కూడా పిలుస్తారు. నటి సమంత వెంట తోటి నటీనటులు, దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం విడుదల కావాల్సి ఉండగా, ఖుషీ సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఇంకా చాలా సినిమాలు ఆమె ఖాతాలో వేచి ఉన్నాయి. 

More Telugu News