Chiranjeevi: ముందు నాపై పూల వర్షం కురిపించారు... ఆ తర్వాత కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి

  • 'నిజం విత్ స్మిత' టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సింగర్ స్మిత
  • మెగాస్టార్ చిరంజీవితో తొలి షో
  • ఆసక్తిని పెంచుతున్న ప్రోమో
Chiranjeevi in talk show with Smitha

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ప్రస్తుతం ఓటీటీపై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో పలు టాక్ షోలు ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నాయి. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో దేశంలోని టాక్ షోలలో కెల్లా టాప్ ర్యాంకింగ్స్ లో నిలిచిన విషయం కూడా అందరికీ తెలిసిందే. 

తాజాగా సింగర్ స్మిత సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'నిజం విత్ స్మిత' అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఆమె రెడీ అయింది. ఈ షోలో సినీ, రాజకీయ, పబ్లిక్ సర్వెంట్లు ఇలా ఎంతో మంది ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తికర విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆమె చేస్తోంది. తన టాక్ షోను మెగాస్టార్ చిరంజీవితో ఆమె ప్రారంభించబోతోంది. చిరుతో చేసిన షో ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఈ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాబోతున్నారు. 

మరోవైపు చిరంజీవితో షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో చిరుకు స్మిత ఎన్నో ప్రశ్నలను సంధించింది. కాలేజ్ డేస్ లో మీ ఫస్ట్ క్రష్? స్టార్ డమ్ అనేది కొంతమందికే.. ఆ స్థాయికి వెళ్లాలంటే ఎన్నో అవమానాలు, అనుమానాలు ఉంటాయి. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? వంటి ప్రశ్నలు చిరుకు ఎదురయ్యాయి. ఈ క్రమంలో, తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ఘటనను చిరంజీవి చెప్పారు. 

జగిత్యాలలో పర్యటించినప్పుడు తొలుత పైనుంచి తనపై పూలవర్షం కురిసిందని... ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే, కోడిగుడ్లతో కొట్టారని చెప్పారు. మళ్లీ ఒక వరప్రసాద్ మెగాస్టార్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉందంటారా? అనే ప్రశ్నను స్మిత వేసింది. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. పూర్తి ఎపిసోడ్ విడుదల కానున్న 10వ తేదీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 


More Telugu News