Team India: ఈ నెల 10 నుంచి మహిళల వరల్డ్ కప్... తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడనున్న భారత అమ్మాయిలు

  • 10 జట్లతో టీ20 వరల్డ్ కప్
  • గ్రూప్-బీలో భారత్, పాకిస్థాన్
  • ఫిబ్రవరి 12న దాయాదుల సమరం 
  • బలంగా కనిపిస్తున్న భారత అమ్మాయిల జట్టు
Indian eves takes on Pakistan team in the T20 World Cup first match

దక్షిణాఫ్రికా గడ్డపై ఈ నెల 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్ లు ఆడతాయి. కాగా, దాయాది దేశాలు రెండూ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లతో పాటు గ్రూప్-బీలో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ మహిళల జట్లు కూడా ఉన్నాయి. 

కాగా, ఈ మెగా టోర్నీలో తన మొదటి మ్యాచ్ ను భారత్ ఫిబ్రవరి 12న పాకిస్థాన్ తో ఆడనుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్ తో, ఫిబ్రవరి 18న ఇంగ్లండ్ తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్ తో భారత మహిళల జట్టు తలపడనుంది. 

ఈ వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాలో తెలుగమ్మాయి అంజలి శర్వాణి చోటు దక్కించుకోవడం విశేషం. ఇక, ఇటీవల దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్-19 వరల్డ్ కప్ ను భారత్ అమ్మాయిలే చేజిక్కించుకోవడం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ను విజయపథంలో నడిపించిన షెఫాలీ వర్మ కూడా సీనియర్ జట్టులో చేరింది. 


వరల్డ్ కప్ లో ఆడే టీమిండియా ఇదే...
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, స్మృతి మంధన, రిచా గోష్, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, అంజలి శర్వాణి, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, శిఖా పాండే, దేవికా వైద్య, రేణుకా ఠాకూర్.

More Telugu News