Team India: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రాక్టీసు ప్రారంభించిన టీమిండియా

Team India has begun practice for four match test series against Australia
  • భారత్, ఆసీస్ మధ్య 4 టెస్టుల సిరీస్
  • ఫిబ్రవరి 9న ప్రారంభం
  • తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న నాగపూర్
  • చెమటోడ్చుతున్న ఇరుజట్ల ఆటగాళ్లు
ఇటీవల వన్డే, టీ20 సిరీస్ లతో బిజీగా గడిపిన టీమిండియా ఇప్పుడు సిసలైన టెస్టు సమరానికి సన్నద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ ఈ నెల 9న ప్రారంభం కానుండగా, భారత ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు నాగపూర్ వేదికగా నిలుస్తుండగా, టీమిండియా క్రికెటర్లు నెట్స్ లో చెమటోడ్చారు. 

గాయంతో సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా ఇటీవల సౌరాష్ట్ర జట్టు తరఫున తమిళనాడుతో రంజీ మ్యాచ్ ఆడి ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు.

అటు, ఆస్ట్రేలియా జట్టు బెంగళూరు శివార్లలోని ఆలూర్ క్రికెట్ స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన పిచ్ లపై ప్రాక్టీసు చేస్తోంది. తద్వారా ఈ సిరీస్ ను ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో అర్థమవుతోంది. 

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండు అగ్రశ్రేణి జట్లు తలపడుతున్న సిరీస్ కావడంతో అందరి దృష్టి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది.
Team India
Australia
Test Series
Border-Gavaskar Trophy
Practice

More Telugu News