Nara Lokesh: పాదయాత్రలో లోకేశ్ ను కలిసిన బీజేపీ నేతలు.. ఈనాటి హైలైట్స్

  • ఈరోజు 16.2 కిలోమీటర్లు నడిచిన లోకేశ్
  • బార్ అసోసియేషన్ లోని లాయర్లకు ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ
  • జగన్ అరాచక పాలనపై యుద్ధం మొదలయిందన్న లోకేశ్
BJP leaders meets Nara Lokesh in padayatra

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఏడవ రోజు ఘనంగా ముగిసింది. పలమనేరులోని క్లాక్ టవర్ సెంటర్ లో లోకేశ్ నిర్వహించిన బహిరంగసభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పలమనేరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష ప్రజలతో బహిరంగసభ ప్రాంతం కిటకిటలాడింది. ప్రాంతం మొత్తం జై లోకేశ్, జై టీడీపీ నినాదాలతో మారుమోగింది. ఈనాటి లోకేశ్ పాదయాత్ర రామాపురంలోని ఎమ్మాస్ హాస్పిటల్ నుంచి ప్రారంభమయింది. 

పలు ప్రాంతాల గుండా కొనసాగిన పాదయాత్రలో లోకేశ్ ను ఆర్యవైశ్య సోదరులు కలిశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆర్యవైశ్యులు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు టీడీపీ అండగా నిలుస్తుందని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే లోకేశ్ పాదయాత్రకు బీజేపీ నేతలు సైతం సంఘీభావం తెలిపారు. గాంధీనగర్ క్రాస్ వద్ద లోకేశ్ ను బీజేపీ నేతలు కలిశారు. లోకేశ్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. లోకేశ్ ను కలిసిన నేతల్లో బీజేపీ స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ గుత్తా నారాయణస్వామి నాయుడు కూడా ఉన్నారు. 

పాదయాత్ర సందర్భంగా ఎంసీ పాలెం, రంగాపురంకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. పలమనేరు పెద్ద మసీదు వీధికి చెందిన ముస్లిం కుటుంబాలు పసుపు కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని వీరంతా తెలిపారు. వైసీపీ విధానాలు నచ్చకే టీడీపీలో చేరుతున్నామని వీరు చెప్పారు. 

న్యాయవాదులు, పట్టు రైతులు కూడా లోకేశ్ ను కలిశారు. లాయర్లతో లోకేశ్ మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ లోని వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టు రైతులతో మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రోత్సాహకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. మరోవైపు లోకేశ్ ను కలిసిన టమోటా రైతులు... వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి సహకారం అందడం లేదని చెప్పారు. టమోటా రైతులను గిట్టుబాటు ధర కల్పించేలా పటిష్ట చర్యలను తీసుకుంటామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగు పరుస్తామని తెలిపారు. 

బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... జగన్ అరాచక పాలనపై యుద్ధం మొదలయిందని చెప్పారు. సొంత బాబాయ్ ని గొడ్డలితో రాత్రి పూట కసిగా నరికారని అన్నారు. బాబాయ్ చంపిన వాడిని, తల్లీ, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసిన వాడిని క్రిమినల్ అంటారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అనే పెద్ద క్రిమినల్ ను జగన్ తయారు చేశారని విమర్శించారు. తన బినామీ, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ తో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ లాంటి అన్ని కుంభకోణాలను పెద్దిరెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు నారా లోకేశ్ 16.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 88.5 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు.

మరోవైపు టీడీపీ సీనియర్ కార్యకర్తలకు నారా లోకేశ్ పాదాభివందనం చేశారు. బాల సుందరం రెడ్డి, రామకృష్ణ, రాజా రెడ్డి, వెంకటరమణ రెడ్డి, డీఆర్ ప్రకాష్, బి.పి. నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, వెంకటరత్నం, దొరస్వామి నాయుడు, తంగవేలు శెట్టి, ఓబుల్ రెడ్డి, వెంకటప్ప, క్రిష్ణ గౌడ్, శీనప్ప, తిప్పారెడ్డి, నారాయణ మొదలియార్, చెంగారెడ్డి, కృష్ణమూర్తి నాయుడుల‌ పాదాలకు ఆయన నమస్కరించారు. మీలాంటి పెద్ద‌ల త‌ర‌గ‌ని అభిమాన‌మే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ‌ర‌క్ష అని లోకేష్ అన్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌లు 'ఆయురారోగ్యాల‌తో వందేళ్లు వ‌ర్థిల్లు. తెలుగుజాతి ఉన్నంత‌వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీకి ఎదురులేదు. యువ‌కులైన మీ సార‌ధ్యంలో పార్టీ మ‌రింత బలోపేతం కావాలి' అని లోకేశ్ ను దీవించారు.


More Telugu News