Australia: ఆస్ట్రేలియాలో త్రివర్ణ పతాకం పట్టుకున్నభారతీయులపై ఖలిస్థాన్ మద్దతుదారుల దాడి

  • రాడ్లతో దాడి చేయడంతో ఐదుగురికి గాయాలు 
  • వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ నేత మంజీందర్
  • గత వారం హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఖలిస్థానీలు
Indians carrying tricolour attacked by pro Khalistan forces in Australia 5 injured

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న ఖలిస్థాన్ మద్దతుదారులు మరో అడుగు ముందుకేసి భారతీయులపై దాడులు చేస్తున్నారు. జాతీయ జెండాను పట్టుకుని వెళ్తున్న భారతీయులపై ఖలిస్థాన్ అనుకూల శక్తులు దాడి చేశారు. ఈ  వీడియోను బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా షేర్ సోషల్ మీడియాలో చేశారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడినట్లు తెలుస్తోంది. త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న ఇండియన్స్ పై ఖలిస్థాన్ మద్దతు దారులు రాడ్లతో దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశారు. 

‘ఆస్ట్రేలియాలో ఖలిస్థానీ అనుకూల, భారత వ్యతిరేక కార్యకలాపాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలతో దేశంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న సంఘ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి' అని మంజీందర్ సిర్సా ట్వీట్ చేశారు. 

కాగా, హింసాత్మక దాడి తర్వాత ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు విక్టోరియా పోలీసులు తెలిపారు. వారికి పెనాల్టీ నోటీసు జారీ చేశారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలను ఖలిస్థానీలు ధ్వంసం చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లో గత కొన్ని వారాలుగా ఖలిస్థాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలతో మూడు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ ఈ దాడులను ఖండించింది. ఇవి భారతీయ సమాజం మధ్య శత్రుత్వం, అసమ్మతిని ప్రోత్సహించే కఠోరమైన ప్రయత్నాలు అని పేర్కొంది.

More Telugu News