Team India: తొలి టీ20లో టీమిండియా ఓటమి

  • రాంచీ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం
  • తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసిన భారత్
Team India lost 1st T20 to New Zealand

న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ లో అదే జోరు కనబర్చలేకపోయింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) చివర్లో అర్థసెంచరీతో పోరాడినప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో, టీమిండియాకు పరాజయం తప్పలేదు. 

టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం లక్ష్యఛేదనపై బాగా ప్రభావం చూపింది. గిల్ 7, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. 

ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ 47, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును ఆదుకున్నారు. అయితే వారిద్దరూ అవుట్ కాగా, ఇన్నింగ్స్ నడిపించే భారం వాషింగ్టన్ సుందర్ పై పడింది. అతడికి మరో ఎండ్ నుంచి సహకారం అందించేవాళ్లు కరవయ్యారు. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 

కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ 2, కెప్టెన్ శాంట్నర్ 2, ఫెర్గుసన్ 2, డఫీ 1, సోధీ 1 వికెట్ తీశారు. అంతకుముందు, న్యూజిలాండ్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. 

కాగా, ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ జనవరి 29న లక్నోలో జరగనుంది.

More Telugu News