Tamilisai Soundararajan: తెలంగాణ రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

  • నేడు రిపబ్లిక్ డే వేడుకలు
  • తెలంగాణ రాజ్ భవన్ లో పలువురు ప్రముఖులకు సన్మానం
  • నాటు నాటు పాటకు అంతర్జాతీయ పాప్యులారిటీ
  • ఆస్కార్ నామినేషన్ పొందిన వైనం
Governor Tamilisai felicitates MM Keeravani and Chandrabose

భారత 74వ రిపబ్లిక్ డే వేడుకలను తెలంగాణ రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ కావడం, సంగీతదర్శకుడు కీరవాణి పద్మశ్రీకి ఎంపిక కావడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ లను గవర్నర్ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో, ప్రశంసాపత్రం అందించారు. రాజ్ భవన్ లో నేడు గవర్నర్ నుంచి సత్కారం అందుకున్నవారిలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి వ్యవస్థాపకులు, సివిల్స్ శిక్షకురాలు బాలలత తదితరులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ కూడా పాల్గొన్నారు. 

కాగా, నాటు నాటు పాట ఇటీవల ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ పొందడం తెలిసిందే. మార్చి రెండో వారంలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. నాటు నాటు పాటకు ఇప్పటికే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది.

More Telugu News