Bandi Sanjay: బండి సంజయ్ అద్భుతంగా మాట్లాడతారు.. ఆయనను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తారు: మోదీ ప్రశంసలు

  • నిన్న ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • ప్రజాసంగ్రామ యాత్రపై వివరించిన బండి సంజయ్
  • హిందీలో తడబడడంతో తెలుగులోనే చెప్పాలన్న మోదీ
  • బండి సంజయ్‌ను చూస్తే తనకు వెంకయ్యనాయుడు గుర్తొస్తున్నారన్న ప్రధాని
  • ప్రజాసంగ్రామ యాత్ర నుంచి ఇతర రాష్ట్రాలూ నేర్చుకోవాలన్న మోదీ
Modi Says Bandi Sanjay seems as Venkaiah Naidu

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను చూస్తుంటే తనకు వెంకయ్య నాయుడు గుర్తొస్తున్నారని, ఆయన అద్భుతంగా మాట్లాడతారని అన్నారు. ఢిల్లీలో నిన్న ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజున.. రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రజాసంగ్రామ యాత్రపై బండి సంజయ్ నివేదిక సమర్పించారు. ప్రధాని మోదీ కల్పించుకుని ప్రజాసంగ్రామ యాత్ర గురించి చెప్పాలని సంజయ్‌కు సూచించారు. 

దీంతో హిందీలో మాట్లాడడం ప్రారంభించిన సంజయ్.. కాసేపటి తర్వాత ప్రసంగం ఆపి హిందీలో తాను పూర్తిస్థాయిలో చెప్పలేకపోతున్నానని అన్నారు. స్పందించిన ప్రధాని భావోద్వేగాలను చెప్పేందుకు మాతృభాషను మించినది లేదని, అందులో చెప్పాలని సూచించారు. దీంతో సంజయ్ యాత్రా విశేషాలను తెలుగులోనే వివరించారు. ఆయన ప్రసంగం ముగించిన వెంటనే కార్యవర్గ సభ్యులు కరతాళ ధ్వనులతో అభినందించారు. 

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి సంజయ్ ఎంతగానో కష్టడపడుతున్నారని ప్రశంసించారు. ఎంతో గొప్పగా యాత్ర చేసిన సంజయ్ తన గురించి తాను చెప్పుకోలేకపోతున్నారని, ఆయన యాత్రలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ ఆ విషయాలను హిందీలో వివరించాలని కోరారు. దీంతో సంజయ్ తెలుగులో చెప్పిన విషయాలను తరుణ్ చుగ్ హిందీలో వివరించారు. 

ఆ తర్వాత మోదీ మరోమారు మాట్లాడుతూ.. బండి సంజయ్ యాత్ర చేపట్టిన ప్రాంతాలను ఇతర రాష్ట్రాల నేతలు సందర్శించి యాత్రపై అధ్యయనం చేయాలని సూచించారు. భవిష్యత్తులో సంజయ్ చేపట్టే యాత్రకు ఇతర రాష్ట్రాల నుంచి యువమోర్చా నేతలను పంపిస్తే మార్గదర్శకంగా ఉంటుందని చెబుతూ బండి సంజయ్ భుజం తట్టి అభినందించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా తన ప్రసంగంలో ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావిస్తూ సంజయ్‌ను అభినందించారు.

More Telugu News