oxfam: భారత్ లోని సంపన్నులపై 2% పన్ను వేస్తే.. మూడేళ్లపాటు దేశంలోని చిన్నారుల ఆకలి తీర్చొచ్చు!

  • దేశ జనాభాలోని 1శాతం ధనవంతుల దగ్గరే 40 శాతం సంపద
  • ఆక్స్ ఫామ్ వార్షిక నివేదికలో వెల్లడి
  • వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విడుదల
  • 2022లో భారత్ లోని బిలియనీర్ల సంఖ్య 166
Indias Richest 1 percent Own More Than 40 percent Of Countrys Total Wealth

భారత దేశ సంపదలో దాదాపు సగం సంపద కొద్దిమంది ధనవంతుల దగ్గరే ఉందని ఆక్స్ ఫామ్ నివేదిక సోమవారం వెల్లడించింది. దావోస్ కేంద్రంగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ఈ నివేదికను విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో భారత్ లోని బిలియనీర్ల సంఖ్య పెరిగిందని పేర్కొంది. 2020లో 102 మంది బిలియనీర్లు ఉండగా.. 2022 ఏడాదిలో వారి సంఖ్య 166 మందికి చేరిందని తెలిపింది. దేశ జనాభాలో సంపన్నులు కేవలం 1 శాతం మాత్రమేనని ఈ నివేదికలో పేర్కొంది. అయితే, ఈ ఒక్క శాతం ధనవంతుల దగ్గరే దేశ సంపదలో 40 శాతం ఉందని వెల్లడించింది. జనాభాలో దాదాపు సగం మంది దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమేనని తెలిపింది.

ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించిన మరికొన్ని ఆసక్తికర విశేషాలు..

  • భారత్ లోని సంపన్నులపై ఒక్కసారి 5 శాతం పన్ను వసూలు చేస్తే వచ్చే మొత్తంతో దేశంలోని పిల్లలందరికీ చదువు చెప్పించవచ్చు
  • 2017-2022 మధ్య కాలంలో గౌతమ్ అదానీ సంపాదన రూ.1.79 లక్షల కోట్లు.. ఈ మొత్తంతో దేశంలోని 50 లక్షల మంది ప్రైమరీ స్కూలు టీచర్లకు ఏడాది పాటు జీతాలు చెల్లించవచ్చు
  • దేశంలోని సంపన్నుల మొత్తం ఆస్తులపై ఒక్కసారి 2 శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తే వచ్చే మొత్తం రూ. 40,423 కోట్లు.. ఈ మొత్తంతో దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మూడేళ్ల పాటు భోజనం పెట్టొచ్చు
  • భారత్ లోని పది మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను (ఒక్కసారి) వేస్తే వచ్చే మొత్తం రూ. 1.37 లక్షల కోట్లు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (రూ.86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ.3,050 కోట్లు) ల బడ్జెట్ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
  • దేశంలోని స్త్రీ, పురుషుల సంపాదనలో తేడా చాలా ఎక్కువగా ఉంది. పురుషుల సంపాదనతో పోలిస్తే స్త్రీల సంపాదన రూపాయిలో కేవలం 63 పైసలు మాత్రమే.
  • సమాజంలోని మిగతా వర్గాలు సంపాదించే మొత్తంలో 55 శాతం మాత్రమే రైతులు ఆర్జిస్తున్నారు.
  • కరోనా కష్టకాలంలో దేశంలోని సంపన్నుల ఆస్తులు 121 శాతం పెరిగింది. ఈ కాలంలో సంపన్నులు రోజుకు రూ.3,608 కోట్లు సంపాదించారు.
  • 2021-22 ఏడాదికి జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం రూ.14.83 కోట్లు కాగా అందులో 64 శాతం దేశంలోని అట్టడుగు వర్గాలే చెల్లించారు. దేశంలోని టాప్ 10 ధనవంతుల నుంచి వసూలైన జీఎస్టీ కేవలం 3 శాతం మాత్రమే!

More Telugu News