Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ట్వీట్ పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ కౌంటర్.. విరుచుకుపడుతున్న వైసీపీ అభిమానులు

  • గ్లోల్డెన్ గ్లోబ్ నెగ్గిన సందర్భంగా ఆర్ఆర్ఆర్ ను అభినందించిన సీఎం జగన్
  • ప్రపంచ వేదికపై తెలుగు పతాకం రెపరెపలాడుతుందన్న జగన్
  • భారత పతాకం కాకుండా తెలుగు పతాకం అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అద్నాన్
Adnan Sami reacts to AP CMs Telugu flag is flying high post after RRRs win

దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయంతో పాటు ఎంతో ఖ్యాతిని అందుకుంటోంది. అంతర్జాతీయ అవార్డులలోనూ సత్తా చాటుతోంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాన్ని గెలిచింది. ఉత్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఈ అవార్డు అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి చిత్ర బృందాన్ని అభినందించారు. అయితే, ఆయన చేసిన ట్వీట్ పై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

ఆర్ ఆర్ ఆర్ ని అభినందిస్తూ.. ‘ప్రపంచ వేదికపై తెలుగు పతాకం రెపరెపలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం’ అని జగన్ ట్వీట్ చేశారు. అయితే, ఈ సందేశంలో ఏపీ సీఎం తెలుగు పతాకం అనడంపై అద్నాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తెలుగు పతాకమా? మీరు చెబుతున్నది భారత పతాకమే కదా? మనమంతా భారతీయులం. కాబట్టి దయచేసి మీరు భారత్ నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనది ఒకే దేశం. మనం 1947లో చూసిన ఇలాంటి వేర్పాటు వాద వైఖరి మంచిది కాదు’ అని అద్నాన్ సమీ ట్వీట్ చేశారు. 

దీనిపై జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అద్నాన్ కు కౌంటర్ ఇచ్చారు. అయితే, తన కామెంట్లను అద్నాన్ సమర్థించుకుంటూ మరో ట్వీట్ చేశారు. ‘తెలుగు సినిమా యావత్ భారతదేశాన్ని గర్వించేలా చేసింది అని రాసి ఉంటే బాగుండేది. అదే నిజం’ అని పేర్కొన్నారు. అయితే, అద్నాన్ పై వైసీపీ నాయకులు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దాంతో ట్విట్టర్లో ఈ విషయంపై రచ్చ నడుస్తోంది.

More Telugu News