NVSS Prabhakar: హరీశ్ రావును ఢిల్లీకి పంపేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను పెట్టారు: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

  • బీఆర్ఎస్ బలం నానాటికీ తగ్గుతోందన్న ప్రభాకర్ 
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సోనియా, రాహుల్ స్పందించలేదని విమర్శ 
  • కమ్యూనిస్టుల కోరిక మేరకే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ అని వ్యాఖ్య 
KCR started BRS to send Harish Rao to Delhi says NVSS Prabhakar

బీఆర్ఎస్ బలం నానాటికీ తగ్గుతోందని, అందుకే ఖమ్మంలో తొలి బహిరంగ సభను పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఖమ్మం సభలో రైతులకు దిక్సూచిని చూపిస్తానని కేసీఆర్ చెపుతున్నారని... అదే ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. పాసు పుస్తకాలు బ్యాంకుల్లో తనఖాల్లో ఉండటాన్ని రైతులు అవమానంగా భావిస్తున్నారని చెప్పారు. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ పెట్టింది పేరని ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చాలా మందిని లాగేశారని... అయినప్పటికీ, ఈ ఫిరాయింపులపై సోనియాగాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ స్పందించలేదని విమర్శించారు. కేసీఆర్ ను కాంగ్రెస్ కాపాడుతోందని దుయ్యబట్టారు. అందుకే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు. కమ్యూనిస్టులు కూడా కేసీఆర్ కు అనుకూలంగా మారిపోయారని అన్నారు. కమ్యూనిస్టుల కోరిక మేరకే కేసీఆర్ ఖమ్మంలో సభ పెడుతున్నారని చెప్పారు. 

తన కొడుక్కి పోటీ అవుతాడేమో అనే యోచనతో హరీశ్ రావును ఢిల్లీకి పంపించేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాజ్యాంగబద్ధంగా ఏపీ కేడర్ కు చెందిన అధికారి అని... అయితే ఆయన పట్ల ఉన్న ప్రేమతో ఆయనను కేసీఆర్ తెలంగాణలో ఉంచుకున్నారని విమర్శించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లను సలహాదారులుగా నియమించుకుంటున్నారని చెప్పారు.

More Telugu News