Rajasri: ఆ షూటింగులో పాములను పట్టుకుని భయంతో వణికిపోయాను: సీనియర్ నటి రాజశ్రీ

  • అలనాటి నాయికగా మెప్పించిన రాజశ్రీ 
  •  ఎక్కువగా జానపదాలలో అలరించిన నాయిక 
  • తెలుగులో ఎన్టీఆర్ .. కాంతారావులతో ఎక్కువ సినిమాలు
  •  ఓ కన్నడ సినిమా షూటింగును గుర్తుచేసుకున్న రాజశ్రీ  
Rajasri Interview

అలనాటి అందాల నటీమణులలో రాజశ్రీ ఒకరు. అప్పట్లోనే ఆమె తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. తెలుగులో ఆమె ఎక్కువగా జానపదాలు చేశారు. ఈ జోనర్లో ఆమె ఎన్టీఆర్ .. కాంతారావులతో ఎక్కువగా నటించారు. ఇక కన్నడలో కూడా ఆనాటి జానపదాలలో ఆమెనే హీరోయిన్. 

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ప్రస్తావించారు. "ఆనాటి జానపదాల్లో నిజమైన ఏనుగులు .. గుర్రాలు .. పాములు వాడేవారు. ఇప్పటిలా అప్పుడు గ్రాఫిక్స్ లేవు. అందువలన వాటితో కలిసి నటించవలసి వచ్చేది. జానపదానికి సంబంధించిన ఒక కన్నడ సినిమా షూటింగు జరుగుతోంది. షాట్ గ్యాపులో నేను చిన్న కునుకు తీశాను. షాట్ రెడీ అంటూ నన్ను నిద్రలేపి, నా చేతిలో రెండు నాగుపాములు పెట్టేశారు. ఒక్కసారిగా నాకు నిద్రమత్తు వదిలిపోయింది" అన్నారు. 

"ఆ పాములకు మూతి కొట్టేసి ఉన్నప్పటికీ, నేను భయంతో వణికిపోయాను. నిజమైన పాములను అంత దగ్గరగా అప్పటివరకూ చూడలేదు .. ఎప్పుడూ పట్టుకోలేదు. అవి అటూ ఇటూ కదులుతూ ఉంటే ఇక డైలాగ్ ఏం వస్తుంది? అంతలో సెట్ లో పైనుంచి ఒక లైట్ బోయ్ పడిపోయాడు. అందరూ అటువైపు పరిగెత్తారు. రెండు పాములు పట్టుకుని భయంతో నేను అలాగే నుంచుండిపోయాను. వాటిని పట్టుకోలేను .. వదిలేయలేను. ఆ పరిస్థితిని తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది .. నవ్వొస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News