APSRTC: నేటి నుంచే ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు.. ప్రయాణికులను ఆకట్టుకుంటున్న రాయితీలు!

APSRTC Sankranti Special Buses Available From Today Onwards
షార్ట్స్‌లో చూడండి
ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే రోడ్డెక్కనున్నాయి. పండుగ స్పెషల్ బస్సుల టికెట్ ధరను గతేడాది 50 శాతం వరకు పెంచిన ఆర్టీసీ అధికారులు ఈసారి మాత్రం చార్జీలు పెంచకపోగా ప్రత్యేక రాయితీలతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రణాళికలు రచించారు. 

ఈ క్రమంలో పండుగ ప్రత్యేక బస్సుల్లో 5 నుంచి 25 శాతం వరకు రాయితీలు ప్రకటిస్తూ ప్రయాణికులు ‘ప్రైవేటు’ వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రానుపోను ఒకేసారి రిజర్వు చేయించుకుంటే 10 శాతం, నలుగురికి మించి కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి ప్రయాణిస్తే 5 శాతం రాయితీ ఇస్తోంది. అలాగే, వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే 5 శాతం, వృద్ధుల చార్జీల్లో 25 శాతం తగ్గింపు ప్రకటించింది.

సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచి ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 3,120 బస్సులను అధికారులు సిద్ధం చేశారు. పండుగ అనంతరం తిరిగి వచ్చే వారి కోసం 3,280 బస్సులు నడపనున్నారు. ఇవి ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ యాప్, వెబ్‌సైట్, అధికారిక ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ చేయించుకుని ప్రకటించిన రాయితీలు పొందొచ్చని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Go Back to Shorts
APSRTC
Sankranti Special Buses
Andhra Pradesh

More Telugu News