Team India: ఉత్కంఠపోరులో గట్టెక్కిన టీమిండియా... తొలి టీ20లో మనదే బోణి!

  • శ్రీలంకతో ముంబయిలో తొలి టీ20
  • 2 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా
  • తొలుత 5 వికెట్లకు 162 పరుగులు చేసిన భారత్
  • లక్ష్యఛేదనలో శ్రీలంక 160 ఆలౌట్
  • శివమ్ మావికి 4 వికెట్లు
Team India beat Sri Lanka by 2 runs in 1st T20

శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబయి వాంఖెడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోరులో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 160 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. 

శ్రీలంక ఇన్నింగ్స్ లో కెప్టెన్ దసున్ షనక 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి హసరంగ (10 బంతుల్లో 21) నుంచి సహకారం లభించింది. ఓ దశలో శ్రీలంక 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా ఈ జోడీ ఆదుకుంది. అయితే హసరంగను శివమ్ మావి అవుట్ చేయగా, షనకను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు. 

చివరి ఓవర్లో లంక విజయానికి 13 పరుగులు అవసరం కాగా, కరుణరత్నే (23 నాటౌట్), కసున్ రజిత (5) జోడీ పోరాడింది. ఇక ఆఖర్లో ఒక్క బంతికి 4 పరుగులు కావాల్సి ఉండగా, అక్షర్ పటేల్ విసిరిన బంతిని కరుణరత్నే బౌండరీ దాటించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆఖరి ఓవర్లో ఇద్దరు లంక బ్యాట్స్ మెన్ రనౌట్ అయ్యారు. 

టీమిండియా బౌలర్లు శివమ్ మావి 4, ఉమ్రాన్ మాలిక్ 2, హర్షల్ పటేల్ 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 5న పూణేలో జరగనుంది.

More Telugu News