unicef: తెలంగాణ విధానం దేశానికే ఆదర్శం.. రాష్ట్ర ప్రభుత్వానికి యునిసెఫ్ ప్రశంస

  • మాతా,శిశు సంరక్షణలో రాష్ట్రం ముందుందని మెచ్చుకోలు
  • మిడ్ వైఫరీ వ్యవస్థ చాలా బాగుందని కితాబు
  • రాష్ట్రవ్యాప్తంగా 4 ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా శిక్షణ
UNICEF praises Telangana for being a flag bearer for Midwifery in India with maternity care

తెలంగాణ రాష్ట్రంలో మాతా, శిశు సంరక్షణ ఎంతో బాగుందని యునిసెఫ్ మెచ్చుకుంది. మాతా,శిశు మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిడ్ వైఫరీ వ్యవస్థ అద్భుతమని కొనియాడింది. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ ఈ విధానం ఆదర్శమని ప్రశంసలు కురిపించింది. ఈమేరకు యునిసెఫ్ ఇండియా శుక్రవారం ఓ ట్వీట్ చేసింది. ‘ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎ హెల్దీ స్టార్ట్’ హాష్ ట్యాగ్‌తో హైద‌రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న శిశువు ఫోటోను అందులో షేర్ చేసింది.

సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వైఫరీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వాన్ని యునిసెఫ్ ఇండియా మెచ్చుకుంది. మెటర్నరీ కేర్ లో రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన రీతిలో పనిచేస్తోందని వివరించింది. సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ వైవ్స్ శిక్షణ బాగుందని నర్సింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రతి బాలచంద్రన్ కూడా ఇటీవల మెచ్చుకున్నారు.

ఫెర్నాండెజ్ ఫౌండేషన్, యునిసెఫ్ సాంకేతిక సాయంతో గజ్వేల్ తో పాటు రాష్ట్రంలోని నాలుగు ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ శిక్షణను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గజ్వేల్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులకు అందిస్తున్న మిడ్ వైవ్స్ శిక్షణను రతి బాలచంద్రన్ ఇటీవల పరిశీలించారు. శిక్షణలో భాగంగా సాధారణ ప్రసవాలపై గర్భిణులకు నమ్మకం కలిగేలా ఏ విధంగా చెప్పాలి, వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలని సూచించాలనే అంశాలను స్టాఫ్ నర్సులకు నేర్పుతున్నారు.

More Telugu News