BRS: ఎప్పుడో ఛాలెంజ్ చేస్తే ఇప్పుడా స్పందించేది? మంత్రి కేటీఆర్ ను నిలదీసిన బండి సంజయ్

  • డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయటపెట్టాలని డిమాండ్
  • కేటీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందన్న బండి సంజయ్
  • వేములవాడకు కేసీఆర్ ఇస్తానన్న రూ.400 కోట్లు ఎక్కడని మంత్రికి ప్రశ్న
  • లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై మాట్లాడడం లేదెందుకని నిలదీత
minister ktr verses bjp state chief bandi sanjay

డ్రగ్స్ కేసులో ఆరోపణలపై తాను అప్పుడెప్పుడో సవాల్ చేస్తే ఇన్నిరోజుల తర్వాత మంత్రి కేటీఆర్ స్పందించారని బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. చాలా రోజులు గడవడంతో శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లేమీ దొరకవనే ధీమాతోనే మంత్రి ఇప్పుడు డ్రగ్ టెస్ట్ కు రెడీ అంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందని బండి సంజయ్ చెప్పారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. అంతకుముందు రోజు మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణపై స్పందించారు.

డ్రగ్స్ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన నివేదిక ఏదని మంత్రి కేటీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ రిపోర్టులో ఏముందో బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఆలయానికి రూ.400 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ సొమ్ము ఎక్కడ? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుపై రేగుతున్న దుమారాన్నీ బండి సంజయ్ ప్రస్తావించారు. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపైన మాట్లాడడంలేదు ఎందుకని కేటీఆర్ ను సంజయ్ నిలదీశారు. బెంగళూరు, హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులను విచారించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాను తంబాకు తింటాననేందుకు ఆధారాలు ఏమైనా ఉంటే బయటపెట్టాలని బండి సంజయ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

More Telugu News