టీటీడీ ఈవోకు హైకోర్టులో ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే
- సింగిల్ జడ్జి ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు
- ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఈవోపై కోర్టు ధిక్కారం కేసు
- ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధించిన సింగిల్ జడ్జి
- ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తమను క్రమబద్ధీకరించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలంటూ ముగ్గురు ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. వారిని క్రమబద్ధీకరించాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగింది. దీనిపై ఉద్యోగులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సింగిల్ జడ్జి ధర్మాసనం నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి తీర్పుపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది.