Raj Nath Singh: మన భూమిని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించింది: రాజ్ నాథ్ సింగ్

  • డిసెంబర్ 9న మన భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకు వచ్చారన్న రాజ్ నాథ్
  • వారి ప్రయత్నాలను మన సైనికులు తిప్పికొట్టారని వెల్లడి
  • ఈ ఘటనలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారన్న రక్షణ మంత్రి
China tried to encroach Indian land says Raj Nath Singh in Lok Sabha

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించిందని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని... అయితే మన సైనికులు వారి ప్రయత్నాలను తిప్పికొట్టారని తెలిపారు. వాళ్లు వెనక్కి తిరిగి వెళ్లేలా చేశారని చెప్పారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాతో చర్చించామని తెలిపారు. వారు చేసిన పనిపై అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పారు. 

మన సైనికులు మన సరిహద్దులను కాపాడేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారని రాజ్ నాథ్ తెలిపారు. ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ స్టాండాఫ్ లో ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులు గాయపడ్డారని తెలిపారు. ఎవరూ కూడా తీవ్రంగా గాయపడటం కానీ, మృతి చెందడం కానీ జరగలేదనే విషయాన్ని సభాముఖంగా చెపుతున్నానని అన్నారు. భారత మిలిటరీ కమాండర్లు క్షణాల్లోనే ప్రతిస్పందించడంతో.... చైనా సైనికులు వారి ప్రాంతానికి వెనుదిరిగి పోయారని చెప్పారు. ఇండియా - చైనా స్టాండాఫ్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ లోక్ సభలో పై వివరాలను వెల్లడించారు.

More Telugu News