Karnataka: కర్ణాటకలో జికా వైరస్ తొలి కేసు.. ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తుందా?

  • రాయచూర్ కు చెందిన ఐదేళ్ల బాలికలో గుర్తింపు
  • ప్రకటించిన రాష్ట్ర మంత్రి సుధాకర్
  • ఆమెకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదు
  • దోమ ద్వారా వ్యాపించినట్టు అనుమానం
Zika Virus First case in Karnataka 5 yr old girl tests positive

మన దేశంలో తొలుత కేరళలో వెలుగు చూసిన జికా వైరస్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి విస్తరించింది. రాయచూర్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికలో జికా వైరస్ ను గుర్తించారు. పరీక్షల్లో జికా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య మంత్రి కే సుధాకర్ ప్రకటించారు. ప్రభుత్వం అన్ని ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

పూణె ల్యాబ్ కు ఐదేళ్ల చిన్నారి రక్త నమూనాలను పంపించగా, వైరస్ ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో ఇది తొలి కేసు అని, పరిస్థితిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని మంత్రి చెప్పారు. పూణె ల్యాబ్ కు నమూనాలను ఈ నెల 5న పంపించగా, జికా వైరస్ ఉన్నట్టు 8న రిపోర్ట్ వచ్చింది. మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం జికా వైరస్ కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో బయటపడినట్టు చెప్పారు. ‘‘కర్ణాటకలో ఇదే తొలి కేసు. ముందుగా మేము డెంగ్యు, చికున్ గున్యా అనుకున్నాం. సాధారణంగా ఇలాంటి 10 శాతం నమూనాలను పూణె ల్యాబ్ కు పంపిస్తుంటాం’’ అని వివరించారు. 

ఐదేళ్ల బాలిక ఇటీవలి కాలంలో ఏ ప్రాంతంలోనూ పర్యటించలేదని, దోమ ద్వారా ఆమెకు వైరస్ సోకి ఉంటుందని సమాచారం. జికా వైరస్ ఏడిస్ అనే దోమ నుంచి వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్ గున్యా వైరస్ లను కూడా ఈ దోమే వ్యాప్తి చేస్తుంటుంది. 1947లో ఉగాండాలో తొలిసారి దీన్ని గుర్తించారు. ఇదేమంత ప్రాణాంతకం కాదు. చికిత్సతో రికవరీ అవుతారు.

More Telugu News