K Kavitha: తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి కన్నీళ్లు రావు... నిప్పులే వస్తాయి: కవిత

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై సీబీఐ విచారణ
  • ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందన్న కవిత 
  • బీజేపీ 8 ప్రభుత్వాలను కూల్చివేసిందని ఆరోపణ
Kavitha fires on BJP

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం గురించి ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందని స్పష్టం చేశారు. వ్యక్తులు తాము హక్కులను కోల్పోతున్నామని తెలుసుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ అపహాస్యం చేస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని కవిత మండిపడ్డారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ జాగృతి తరఫున దేశం అంతా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రానికి వెళ్లి జాగృతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 

"వ్యవస్థను మనం కాపాడుకుంటే ఆ వ్యవస్థ మనల్ని కాపాడుతుంది. కానీ కేంద్రం వ్యవస్థలను వివిధ రకాలుగా వాడుకుంటోంది. వ్యక్తులను, వ్యవస్థలను కేంద్రం దెబ్బతీస్తోంది. లేని పోని లీకులతో నేతల వ్యక్తిత్వాలను దెబ్బతీస్తోంది. బీజేపీ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. నాపై కూడా సీబీఐ దాడులు జరుగుతున్నాయి. దాడులకు నేను భయపడను, బెదిరిపోను. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి కన్నీళ్లు రావు... నిప్పులే వస్తాయి" అని కవిత స్పష్టం చేశారు.

More Telugu News