YS Sharmila: కొనసాగుతున్న షర్మిల నిరాహారదీక్ష.. ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైఎస్సార్టీపీ!

  • మంచి నీళ్లు కూడా తీసుకోని షర్మిల
  • డీహైడ్రేట్ అవుతున్న శరీరం
  • షర్మిలకు సంఘీభావంగా దీక్షాస్థలిలో కూర్చున్న విజయమ్మ
 YS Sharmilas health deteriorating as hunger strike continues

ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లు వేస్తున్నారంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆమరణ నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న మధ్యాహ్నం ఆమె ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చెంత నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే వెంటనే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి లోటస్ పాండ్ నివాసం వద్దకు తరలించారు. దీంతో ఆమె తన ఇంటి వద్దే దీక్షను కొనసాగిస్తున్నారు. రాత్రంతా దీక్ష వేదికపైనే గడిపారు. 

షర్మిల నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. షర్మిల కనీసం మంచి నీళ్లు కూడా తీసుకోవడం లేదని వైఎస్సార్టీపీ తెలిపింది. దీంతో శరీరం డీహైడ్రేట్ అవుతోందని, ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొంది. మరోవైపు ఆమెకు అపోలో ఆసుపత్రి వైద్యులు చంద్రశేఖర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఆమె కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెపుతున్నారు. మరోవైపు తన కూతురు దీక్షకు సంఘీభావంగా వైఎస్ విజయమ్మ దీక్షాస్థలిలో కూర్చున్నారు.   

ఇదిలావుంచితే, షర్మిల దీక్ష నేపథ్యంలో లోటస్ పాండ్ ను పోలీసులు దిగ్బంధించారు. పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇంకోవైపు బొల్లారం పోలీస్ స్టేషన్లో 40 మంది పార్టీ నేతలు, బంజారాహిల్స్ పీఎస్ లో ఏడుగురు నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు.

More Telugu News