AAP: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ జయభేరి... బీజేపీ 15 ఏళ్ల పాలనకు ముగింపు

  • మొత్తం 250 వార్డులకు ఎన్నికలు
  • 133 స్థానాల్లో నెగ్గిన ఆప్
  • బీజేపీకి 101 స్థానాలు
  • 8 వార్డులకే పరిమితమైన కాంగ్రెస్
  • సంబరాల్లో మునిగిపోయిన ఆప్ శ్రేణులు
AAP wins Delhi Municipal Corporation elections and ended 15 year BJP rule

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయభేరి మోగించింది. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఆప్ 133 స్థానాలు కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 126 కాగా, ఆప్ 7 స్థానాలు ఎక్కువే గెలిచింది. బీజేపీ 101 వార్డుల్లో నెగ్గింది. 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 15 ఏళ్లుగా బీజేపీనే నెగ్గుతూ వస్తుండగా, ఈసారి ఎదురుగాలి వీచింది. బీజేపీ ప్రస్థానానికి అడ్డుకట్ట వేస్తూ ఆప్ జయకేతనం ఎగురవేసింది. అటు, కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగగా, కాంగ్రెస్ కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. 

2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాలు గెలవగా, ఆప్ కు 48, కాంగ్రెస్ కు 27 వార్డులు దక్కాయి. ఈసారి ఆప్ బలంగా పుంజుకోగా, బీజేపీ హవా తగ్గింది.

More Telugu News