TMC MLAs: 40-45 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: కేంద్ర మంత్రి ప్రమాణిక్

45 TMC MLAs in touch with BJP Union minister Nisith Pramanik in Bengal
  • టీఎంసీ ఎంతో బలహీన పడిందన్న కేంద్ర మంత్రి
  • పేకముక్కల్లా కూలిపోతుందంటూ వ్యాఖ్య
  • తాము ఏం చేయగలమన్నది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని వెల్లడి  
పశ్చిమబెంగాల్ లో త్వరలో ప్రభుత్వం మారనుందా? బీజేపీ నేతల వ్యాఖ్యలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్ సైతం ఇదే ధోరణితో మాట్లాడడం ఈ విధమైన సంకేతాలనే ఇస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన సుమారు 40-45 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నట్టు ప్రమాణిక్ ప్రకటించారు. దీనిపై ఏమి చేయగలమన్నది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని చెప్పారు. 

లోగడ బీజేపీ బెంగాల్ శాఖ చీఫ్ సుకాంత మజుందార్ సైతం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అరెస్ట్ అవుతారని, 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపుల్లో ఉన్నట్టు ప్రకటించారు. అంతేకాదు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సైతం.. టీఎంసీ నేతలు తమతో టచ్ లో ఉన్నట్టు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.  

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్.. కూచ్ బెహార్ లో మాట్లాడుతూ.. టీఎంసీ ఎంతో బలహీనపడిందన్నారు. అది పేకముక్కల్లా కూలిపోతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ, బెంగాల్ దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నట్టు చెప్పారు. తృణమూల్ సర్కారు ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేదని ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం పేర్కొనడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
TMC MLAs
touch
BJP
West Bengal
Union minister Nisith Pramanik

More Telugu News