ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ ను గూఢచర్యం కేసులో ఇరికించిన నిందితులకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
- కేరళ మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన సీబీఐ
- నిందితుల ముందస్తు బెయిల్ ను రద్దు చేసిన సుప్రీం
- బెయిల్ పిటిషన్ లను తిరిగి పరిశీలించాలని కేరళ హైకోర్టుకు ధర్మాసనం సూచన
నంబి నారాయణన్ ను గూఢచర్యం కేసులో ఇరికించిన నిందితుల్లో కేరళ మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్, గుజరాత్ మాజీ ఏడీజీపీ ఆర్బీ శ్రీకుమార్, కేరళకు చెందిన ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఎస్ విజయన్, తంపి ఎస్ దుర్గాదత్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి పీఎస్ జయప్రకాశ్లకు మంజూరు చేసిన బెయిల్ ను సవాల్ చేస్తూ నవంబర్ లో సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.
మరోవైపు కేసును తిరిగి హైకోర్టుకు పంపితే అరెస్టు చేయకుండా తమకు రక్షణ కల్పించాలని పిటిషనర్లలో ఒకరి తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా, నంబి నారాయణన్ పై జరిగిన కుట్ర, దాని నుంచి ఆయన ఎలా బయటపడ్డారన్న విషయాన్ని ఇటీవల వచ్చిన ‘రాకెట్రీ’ అనే సినిమా కళ్లకు కట్టినట్టు చూపించింది.