ORR: హైదరాబాద్‌లో శిల్పా ఫ్లైఓవర్ రెడీ.. నేటి నుంచి పరుగులు పెట్టనున్న వాహనాలు

  • రూ. 250 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం
  • అటు ఇటు 30 అంతస్తుల భవనాల నడుమ అందంగా ఫ్లై ఓవర్
  • ఆకాశం నుంచి చూస్తే శిల్పంగా కనిపించే ఫ్లై ఓవర్
  • ట్రాఫిక్ కష్టాలకు ఇక చెల్లు
Shilpa Flyover Now Ready For Hyderabad People

హైదరాబాద్‌లో నేటి నుంచి మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఐకియా మాల్ వెనక మొదలయ్యే ఈ బ్రిడ్జ్ అటు ఇటు ఉన్న 30 అంతస్తుల ఎత్తయిన భవనాల మధ్య నుంచి సాగిపోతూ ఓఆర్ఆర్ పైకి చేరుతుంది. 

రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ వంతెనకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఆకాశం నుంచి చూస్తే ఇది శిల్పంలా కనిపిస్తుంది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టుల్లో శిల్ప వంతెన మూడో ప్రాజెక్టు. వచ్చే నెలాఖరులో కొండాపూర్ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుంది. ఇక, అవుటర్ రింగురోడ్డు నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లే అవుట్ రెండో దశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుంది.

నగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతుండడంతో ఓఆర్ఆర్ పైకి వాహనాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు కళ్లెం వేసేందుకు శిల్పా లే అవుట్ వరకు నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్ పొడవు 956 మీటర్లు కాగా, వెడల్పు 16 మీటర్లు. హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లలో ఇదే అతి పొడవైనది కావడం గమనార్హం.

More Telugu News