Arvind Kejriwal: సీబీఐ, ఈడీలను నాకు ఒక్కరోజు అప్పగిస్తే బీజేపీలో సగం మంది జైల్లో ఉంటారు: కేజ్రీవాల్

  • దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయన్న కేజ్రీవాల్ 
  • ఆప్ నేతలపై 200 కేసులు పెట్టారని ఆరోపణ
  • ఒక్కటీ నిరూపించలేకపోయారని విమర్శలు
Kejriwal slams BJP in the wake of Delhi Muncipal Elections

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు పెరిగిపోవడం పట్ల స్పందించారు. మా నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా అవినీతిపరులట.... కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు నాకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారు అని స్పష్టం చేశారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చేతిలోనే ఉన్నాయని అన్నారు. తమకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టారని కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా లిక్కర్ స్కాంలో రూ.10 కోట్లు తిన్నాడని అంటున్నారని, వారి చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థల సాయంతో ఆ విషయం నిరూపించవచ్చు కదా? అని నిలదీశారు. 

ఆప్ నేతలపై 200 కేసులు నమోదు చేసినా, ఒక్కటీ నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు. 150 కేసుల్లో తమ నేతలకు క్లీన్ చిట్ వచ్చిందని, మిగిలిన కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News