ఎన్నో ప్రాజెక్టులను సత్యసాయి ఒంటిచేత్తో పూర్తిచేశారు: కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy Praised Satay Sai Baba
  • పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి 97వ జయంతి వేడుకలు
  • ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • సత్యసాయి జయంతిని పురస్కరించుకుని ట్రస్టుకు లేఖ రాసిన ప్రధాని మోదీ
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నిన్న సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయిపై ప్రశంసల వర్షం కురిపించారు. 

ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో మంచి కార్యక్రమాలను, బృహత్తర ప్రాజెక్టులను చేపట్టి ఒంటి చేత్తో ఆయన పూర్తి చేశారన్నారు. ఒకప్పుడు కరవుతో అల్లాడిన అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చారని కొనియాడారు. 153 దేశాల్లో సత్యసాయికి భక్తులు ఉన్నారని, ఆయన స్ఫూర్తిని కేంద్రంలోని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. 2025లో సత్యసాయి శతజయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు.

మరోవైపు, సత్యసాయి జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్రస్టుకు లేఖ రాశారు. మనుషుల్లో తగ్గిపోతున్న మానవత్వాన్ని సత్యసాయిబాబా నిస్వార్థ సేవ మేల్కొలిపిందన్నారు. అందరినీ ప్రేమించాలని, అందరినీ సేవించాలన్న బాబా సూక్తి  భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. బాబా ఆశీర్వాదాలను తాను తీసుకోవడం గొప్ప వరంగా భావిస్తున్నానని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Saya Sai Baba
Puttaparthi
Kishan Reddy
Narendra Modi

More Telugu News