Road Accident: హైవేపై ఒకే ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం.. 38 మందికి గాయాలు

  • పూణె–బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం
  • బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
  • రోడ్డుపై  ఆయిల్ పడటంతో మిగిలిన వాహనాలు పట్టు తప్పి ఢీకొన్న వైనం 
48 Vehicle Pile Up On Pune Bengaluru Highway 38 Injured

పూణెలో రహదారిపై జరిగిన ప్రమాదంలో ఏకంగా 48 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 38 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంతో పూణె–బెంగళూరు రహదారి మొత్తం బ్లాక్ అయిపోయింది. దీనికంతటికీ ఓ ఆయిల్ ట్యాంకర్ కారణమైంది. పూణెలోని నవాలే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దాంతో ట్యాంకర్ లోని ఆయిల్ లీకై రోడ్డు మీద పడింది. దాని కారణంగా మరిన్ని వాహనాలు రోడ్డుపై పట్టు కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

ఒకే చోట పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అవ్వగా.. 30 మందికి గాయాలయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పూణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చాలా కార్లు వాటి ముందున్న కంటైనర్ల కిందకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదాన్ని చిత్రీకరించిన కొందరు ఆ వీడియోలను నెట్ లో షేర్ చేశారు.

More Telugu News