Mp arvind: ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనలో.. ఇద్దరు పీహెచ్ డీ విద్యార్థులు

  • రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు
  • కవితపై వ్యాఖ్యలకు నిరసనగానే దాడి జరిగిందని వెల్లడి
  • ఎంపీ ఇంటి దగ్గర పూర్తిస్థాయి బందోబస్తు లేకపోవడంతో ఘటన
BJP MP Dharmapuri Arvind House Attack Case Hyderabad police gives remand report

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. రిమాండ్ రిపోర్టు వివరాలను మీడియాకు వివరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే దాడి జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. కవితపై ఎంపీ అర్వింద్ పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ప్రెస్ మీట్ లు పెట్టి మరీ టార్గెట్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిందని తెలిపారు.

ఎంపీ ఇంటిపై దాడి చేసిన వారిలో ఇద్దరు పీహెచ్ డీ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ ఇంటి దగ్గర పూర్తిస్థాయిలో బందోబస్తు లేకపోవడంతో మొత్తం తొమ్మిది మంది ఇంట్లోకి చొరబడి దాడి చేశారని వివరించారు. ఇంట్లోని హాల్, పూజ గదులను ధ్వంసం చేయడంతో పాటు పలు వస్తువులను నాశనం చేశారని తెలిపారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారుపైనా దాడి చేశారన్నారు. 

ఎంపీ ఇంటి ఆవరణలో టీఆర్ఎస్ జెండాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసులో నిందితులకు వెంటనే బెయిల్ దొరకడాన్ని ప్రస్తావిస్తూ.. 41 సీఆర్ పీసీ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడంవల్లే నిందితులకు బెయిల్ మంజూరు చేసిందని పోలీసులు తెలిపారు. కాగా, రిమాండ్ రిపోర్టులో జాగృతి నవీనాచారి, జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ పేర్లు కనిపించలేదు.

More Telugu News