Uttar Pradesh: మాజీ ప్రియురాలిని చంపేసి, ఆరు ముక్కలుగా నరికిన ప్రియుడు

  • ఉత్తరప్రదేశ్ లో యువకుడి దారుణం
  • శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్ లో చుట్టి బావిలో పడేసిన వైనం
  • నిందితుడిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్న పోలీసులు
  • ఢిల్లీలో శ్రద్ధ హత్య తరహాలో యూపీలోనూ ఘోరం
UP Man Kills Ex Girlfriend Cuts Body Into 6 Parts

తనను ప్రేమించి, దగ్గరైన యువతి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో దారుణానికి తెగబడ్డాడో యువకుడు. నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి బావిలో పడేశాడు. తలను మాత్రం విడిగా ఓ చెరువులో విసిరేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ దారుణం.. మృతదేహం బయటపడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతడి దగ్గర నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణానికి తన కుటుంబ సభ్యులు కూడా సహకరించారని నిందితుడు బయటపెట్టాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆజంగఢ్ జిల్లాలో పశ్చిమి గ్రామంలోని వ్యవసాయ బావిలో మృతదేహం బయటపడడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ముక్కలుగా నరికిన ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. దీనిని ఓ మహిళ మృతదేహంగా గుర్తించిన పోలీసులు తల మాత్రం దొరకలేదని వెల్లడించారు. విచారణలో అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ ఈ హత్య చేశాడని బయటపడడంతో నిందితుడిని అరెస్టు చేశారు. డెడ్ బాడీ తలను ఓ చెరువులో పడేశానని చెప్పడంతో యాదవ్ ను గ్రామానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించిన యాదవ్ పై కాల్పులు జరపగా.. యాదవ్ కాలుకు బుల్లెట్ గాయమైందని పోలీసులు చెప్పారు. 

తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు యాదవ్ చెప్పాడు. తన తమ్ముడితో కలిసి చెరుకు తోటలో మాజీ ప్రియురాలిని చంపి, శవాన్ని ఆరు ముక్కలు చేసినట్లు తెలిపాడు. అక్కడికి దగ్గర్లోని బావిలో పడేసిన మృతదేహం భాగాలు బయటపడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య తరహాలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఢిల్లీలో శ్రద్ధ వాకర్ ను ఆమె పార్టనర్ అఫ్తాబ్ దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 35 భాగాలు చేసిన విషయం తెలిసిందే!

More Telugu News