Punch Prasad: నడవలేని స్థితిలో 'జబర్దస్త్' కమెడియన్ .. పంచ్ ప్రసాద్!

  • 'జబర్దస్త్'తో పేరు తెచ్చుకున్న పంచ్ ప్రసాద్ 
  • తనదైన టైమింగ్ తో మెప్పించిన కమెడియన్ 
  • కొంతకాలంగా ఆ షోలో కనిపించని ప్రసాద్ 
  • అనారోగ్యంతో బాధపడుతుండటమే అందుకు కారణం
Punch Prasad Special

'జబర్దస్త్' కామెడీ షో చాలామంది కమెడియన్స్ ను వెలుగులోకి తీసుకుని వచ్చింది. ఈ స్టేజ్ పై నుంచి వచ్చిన కమెడియన్స్ దాదాపు అంతా బిజీగా ఉన్నారు. కొంతమంది కొన్ని టీవీ షోస్ లో బిజీ అయితే, మరికొంతమంది సినిమాల్లో అవకాశాలను సంపాదించుకుంటూ వెళుతున్నారు. అయితే ఇతర షోస్ సంగతి అలా ఉంచితే, 'జబర్దస్త్' స్టేజ్ పై కొంతకాలంగా 'పంచ్ ప్రసాద్' కనిపించడం లేదు.  

పంచ్ ప్రసాద్ వెనుకబడటానికి కారణం ఆయనలో ప్రతిభ తగ్గడం కాదు .. కొంతకాలంగా ఆయనను ఇబ్బంది పెడుతున్న అనారోగ్యం. ఆ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన రెండు కిడ్నీలు పాడైపోయినట్టుగా చెప్పారు. అప్పటి నుంచి డయాలసిస్ చేయిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. 

తనకి గల అనారోగ్యం కారణంగా పంచ్ ప్రసాద్ నడవలేని స్థితికి చేరుకున్నాడనీ, ఆయన పరిస్థితి బాగోలేదని 'జబర్దస్త్' నూకరాజు చెప్పాడు. ఆయనకి అందరూ సపోర్టు ఇవ్వాలంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కొంతకాలంగా 'జబర్దస్త్' లో పంచ్ ప్రసాద్ కనిపించకపోవడానికి కారణమేమిటోనని చాలామంది అనుకున్నారు. అందుకు ఆయన అనారోగ్యం కారణమని తెలిసి అంతా బాధపడుతున్నారు.

More Telugu News