Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల కస్టడీ పొడిగింపు

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు
  • విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్
  • కస్టడీ 4 రోజులు పొడిగించిన కోర్టు
Court extends ED custody for Delhi Liquor Scam accused

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో, ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల కస్టడీని కోర్టు పొడిగించింది. నిందితుల ఈడీ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. 

అటు, ఇదే కేసులో అరెస్టయి సమీర్ మహేంద్రు కస్టడీని ఈ నెల 26 వరకు పొడిగించింది. తీహార్ జైలులో సమీర్ ను రెండ్రోజులు ప్రశ్నించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

కాగా, లిక్కర్ స్కాం కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టు వద్ద మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం కేసులో విచారణ సందర్భంగా ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డిని కోర్టుకు తీసుకువచ్చారు. భర్తను చూసేందుకు కనికారెడ్డి కూడా కోర్టు వద్దకు వచ్చారు. అయితే, కోర్టు వద్ద తనను ఫొటో తీసేందుకు యత్నించిన విలేకరులపై కనికారెడ్డి మండిపడ్డారు. తనను ఫొటో తీస్తే కేసు పెడతానని మీడియా ప్రతినిధులను హెచ్చరించారు.

More Telugu News