World: మరో 4 రోజుల్లో 800 కోట్లకు చేరుకోనున్న ప్రపంచ జనాభా.. వచ్చే ఏడాది చైనాను అధిగమించనున్న భారత్!

  • ఈ నెల 15 నాటికి 800 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా
  • 2080 నాటికి వెయ్యి కోట్లు దాటనున్న జనాభా
  • 50 శాతానికి పైగా జనాభా వృద్ధి కేవలం 8 దేశాల్లోనే
World population to reach 800 cr by 15th November 2022

ప్రపంచ జనాభా భారీగా పెరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 15 నాటికి 800 కోట్లకు జనాభా పెరగనుంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 1950 జనాభాతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉందని... 2023లో చైనాను భారత్ అధిగమిస్తుందని తెలిపింది. 2020లో జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా నమోదయిందని... 1950 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారని చెప్పింది. 

2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2080 నాటికి జనాభా వెయ్యి కోట్లను దాటుతుందని... 1,040 కోట్లకు చేసుకుంటుందని తెలిపింది. 2100 నాటికి 1,120 కోట్లను దాటుతుందని వెల్లడించింది. ప్రపంచ జనాభా వృద్ధిలో 50 శాతానికి పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తోందని తెలిపింది. భారత్, నైజీరియా, ఇథియోపియా, ఈజిప్ట్, కాంగో, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, టాంజానియా దేశాల్లో అధిక జనాభా వృద్ధి రేటు ఉందని వెల్లడించింది.

More Telugu News