investigation: శవపేటికను సిద్ధంచేసి పెట్టుకో..! ఆర్ఎస్ఎస్ లీడర్ హత్య కేసు విచారిస్తున్న అధికారికి బెదిరింపులు

  • విచారణ ఆపేయాలంటూ దుండగుల హెచ్చరికలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విచారణ అధికారి
  • కేరళలో సంచలనం రేపిన ఆర్ఎస్ఎస్ లీడర్ హత్య
Investigating officer in RSS leader murder case gets death threat

కేరళలో ఓ హత్య కేసు విచారిస్తున్న పోలీసు అధికారి అనిల్ కుమార్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. విచారణ ఆపేయకుంటే తనను కూడా చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్నారు. శవపేటికను తయారుచేయించి పెట్టుకోమని దుండగులు బెదిరించారని తెలిపారు. దీనిపై అనిల్ కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

గత ఏప్రిల్ లో ఆర్ఎస్ఎస్ లీడర్ ఎస్ కే శ్రీనివాసన్ హత్యకు గురవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును దర్యాఫ్తు చేసి, నిందితులను పట్టుకోవడం కోసం ప్రభుత్వం అనిల్ కుమార్ ను నియమించింది. విచారణలో భాగంగా పలువురిని ప్రశ్నిస్తూ అవసరమైన సమాచారాన్ని అనిల్ కుమార్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. శ్రీనివాసన్ హత్య కేసు విచారణ నుంచి తప్పుకోవాలని తనను హెచ్చరించారని తెలిపారు. లేదంటే తనను కూడా చంపేస్తామని, శవపేటికను తయారుచేయించుకొమ్మని బెదిరించారన్నారు. 

పాలక్కాడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ లీడర్ ఎస్ కే శ్రీనివాసన్ దారుణ హత్యకు గురయ్యారు. గత ఏప్రిల్ 16న పాలక్కాడ్ లోని తన మొబైల్ రిపేర్ షాపులో పనిచేసుకుంటున్న శ్రీనివాసన్ పై ఆరుగురు దుండగులు దాడి చేశారు. కత్తులు, పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా గాయపరిచారు.. దీంతో శ్రీనివాసన్ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, అంతకుముందు రోజు అదే పాలక్కాడ్ లో పీఎఫ్ఐ లీడర్ సుబైర్ హత్యకు గురయ్యారు.

More Telugu News