Telangana: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంటిలో ఐటీ సోదాలు

  • మునుగోడు ఉప ఎన్నికల కీలక బాధ్యతల్లో జగదీశ్ రెడ్డి
  • ఇటీవలే జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈసీ
  • నల్లగొండలోని జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
  • భారీ ఎత్తున నగదు పట్టుబడినట్టుగా ప్రచారం
it raids on minister jagadish reddy pa prabhakar reddy house

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న వేళ సోమవారం రాత్రి తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మంత్రి గండకుంట్ల జగదీశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఐటీ అధికారుల బృందం ఆయన ఇంటిలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ అధినాయకత్వం జగదీశ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్న జగదీశ్ రెడ్డి అలుపెరగకుండా ప్రచారంలో సాగుతున్నారు. రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను జగదీశ్ రెడ్డి అతిక్రమించారంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మరువక ముందే ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం గమనార్హం.

More Telugu News