Munugode: రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోవడం వల్లే మునుగోడుకు ఉప ఎన్నిక: మంత్రి కేటీఆర్

  • కాంట్రాక్ట్ విషయం స్వయంగా తనే చెప్పాడన్న మంత్రి
  • నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి అలవాటేనన్న కేటీఆర్ 
  • బీఆర్ ఎస్ ను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తోందని ఆరోపణలు
Reasong behinid munugode by polls is Rajagopal reddy sold out to bjp

కేంద్రంలోని అధికార బీజేపీకి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోవడం వల్లే మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకున్నాకే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని చెప్పారు. అత్యంత సన్నిహితుడైన అదానీని కూడా కాదని రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టు ఇవ్వడం వెనకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు దక్కిన విషయం స్వయంగా రాజగోపాల్ రెడ్డి కూడా అంగీకరించారని తెలిపారు. సొంత ప్రయోజనాలే తప్ప మునుగోడు నియోజకవర్గాన్ని ఆయన ఏనాడూ పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. మునుగోడులో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో బీజేపీ పెద్దలు కోట్లకొద్దీ నోట్లకట్టలను పంపుతున్నారని ఆరోపించారు. అయినా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేసిన తమకే ప్రజలు పట్టం కడతారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీల నేతలను కేసులు, విచారణ సంస్థల దాడులతో బెదిరించడం, ఆపై పార్టీలో చేర్చుకుని అప్పటికే ఉన్న కేసులను కూడా కొట్టేయించడం బీజేపీ నైజమని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రమేష్, సుజనా చౌదరిపై కేసులు పెట్టారని, బీజేపీలోకి వెళ్లగానే వారిపై కేసులు మాయం అయ్యాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమేనని, మంచి భవిష్యత్తు కావాలనుకునే నేతలు టీఆర్ఎస్ లోకి వస్తారని కేటీఆర్ చెప్పారు. బెదిరింపులకు భయపడే నేతలు బీజేపీలోకి వెళతారని అన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడడమే తప్ప మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేంటని అడిగితే రాష్ట్రంలోని బీజేపీ నేతలు జవాబివ్వలేరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత ఐదు నెలల కాలంలో గుజరాత్ కు కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులు రూ.లక్ష కోట్లని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వరదల వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినా కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News