Andhra Pradesh: జగన్ తో రాంగోపాల్ వర్మ భేటీ... ఏపీ సీఎంతో కలిసి లంచ్ చేసిన దర్శకుడు

  • తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీ
  • 40 నిమిషాలకు పైగా జగన్, వర్మ మధ్య చర్చలు
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం
  • రాజకీయ నేపథ్యంలో తీయబోయే సినిమా గురించి జగన్ కు వర్మ వివరించినట్లు వార్తలు
cine director ramgopal varma meets ap cm ys jagan

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లిన వర్మ...సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపుగా 40 నిమిషాలకు పైగా జగన్, వర్మ చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం జగన్ తో కలిసి వర్మ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. 

సినిమా టికెట్ రేట్ల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో భాగంగా ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో వర్మ భేటీ అయిన దాఖలాలే లేవు. తాజాగా  ఉన్నట్టుండి వర్మ విజయవాడ రావడం, ఆ వెంటనే జగన్ తో భేటీ అయిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయ నేపథ్యంలో తాను తీయబోయే సినిమా గురించి కూడా జగన్ కు వర్మ వివరించినట్టు తెలుస్తోంది.

More Telugu News