Boris Johnson: బ్రిటన్ ప్రధాని పీఠంపై హీటెక్కిన రాజకీయం

  • మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, రిషి సునాక్ సమావేశం
  • ఇద్దరూ ప్రధాని పదవి రేసులో ఉన్నట్టు చెబుతున్న వారి మద్దతుదారులు
  • ఇరువురికీ వంద మంది ఎంపీల మద్దతు ఉందని ప్రచారం
Boris Johnson and Rishi Sunak meet for talks as UK PM race heats up

బ్రిటన్ లో రాజకీయం వేడెక్కింది. వచ్చే వారం బ్రిటన్ నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే కొత్త కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే రేసులో మాజీ పీఎం బోరిస్ జాన్సన్, భారత సంతతికి చెందిన రిషి సునాక్ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. ఈ ఇద్దరూ ముఖాముఖి చర్చలు జరిపారు. అయితే, ఇందులో ఇరువురు ఏం మాట్లాడుకున్నారు? ఏ నిర్ణయం తీసుకున్నారు? అనేది మాత్రం తెలియరాలేదు. బ్రిటీష్ మాజీ ఛాన్స్ లర్ అయిన సునాక్ ఇప్పటికే కనీసం 100 మంది టోరీ ఎంపీల మద్దతును పొందడంతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో ఆయనే ముందున్నారని తెలుస్తోంది. 

అయితే, అనూహ్య పరిణామాల మధ్య కొన్ని నెలల కిందట బ్రిటన్ ప్రధాని పదవిని వదులుకున్న జాన్సన్ తిరిగి గద్దెనెక్కేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనకు కూడా తగినంత మద్దతు ఉందని జాన్సన్ మిత్రుడు కన్జర్వేటివ్ చట్టసభ సభ్యుడు జేమ్స్ డడ్డ్రిడ్జ్ తెలిపారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో సునాక్ ఆర్థిక మంత్రిగా పనిచేసి మెప్పించారు. ఇప్పుడు ప్రధాని పదవి చేపట్టాలని భావిస్తున్నారు. 

ఈ క్రమంలో జాన్సన్ తో ఆయన సమావేశం అవ్వడం చర్చనీయాంశమైంది. బోరిస్ జాన్సన్‌ పదవి నుంచి తొలగిన తర్వాత ఇరువురు కన్జర్వేటివ్ పార్టీ నేతలు వ్యక్తిగతంగా కలుసుకోవడం ఇదే తొలిసారి. పార్టీలో 'అంతర్యుద్ధం' నివారించడానికి, ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిగా ఒక్కరే బరిలో నిలిచే విషయంపై చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో అటు బోరిస్ కానీ, ఇటు సునాక్ కానీ తాము ప్రధాని పదవికి పోటీ చేస్తామని ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. 

కానీ, ఇరువురికీ మ్యాజిక్ ఫిగర్ అయిన వంద మంది ఎంపీల మద్దతు ఉందని వారి మద్దతు దారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎంపీ పెన్నీ మోర్డాంట్ మాత్రమే అధికారికంగా ప్రధాని రేసులో ఉన్నట్టు ప్రకటించారు. ఆమె ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు.

More Telugu News