Bonda Uma: జగన్ వెన్నులో వణుకు పుడుతోంది: బొండా ఉమ

  • రైతుల పాదయాత్రను చూసి జగన్ భయపడుతున్నారన్న బొండా ఉమ
  • పాదయాత్రకు పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శ
  • మహిళా రైతులను పోలీసులు బూటు కాళ్లతో తన్నడం ఏమిటని ఆగ్రహం
Jagan scared of Amaravati farmers padayatra says Bonda Uma

అమరావతి రైతుల పాదయాత్రను చూసి ముఖ్యమంత్రి జగన్ కు వెన్నులో వణుకు పుట్టిందని టీడీపీ నేత బొండా ఉమ ఎద్దేవా చేశారు. వీరిని చూసి జగన్ భయపడుతున్నారని... అందుకే అడుగడుగునా వారి పాదయాత్రకు ఆటంకాలను సృష్టించారని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ ల పాదయాత్రలు శాంతియుతంగా జరిగాయని... ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ప్రశాంతంగానే సాగుతోందని... అమరావతి రైతులు కూడా శాంతియుతంగానే పాదయాత్ర చేస్తున్నారని... అయినా వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రభుత్వ ఆదేశాలతో రైతులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని బొండా ఉమ విమర్శించారు. తాడేపల్లి ఆదేశాలను పాటిస్తున్న ప్రతి పోలీసు అధికారిని టీడీపీ వదిలిపెట్టదని... ప్రైవేటు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడమే కాకుండా, సర్వీస్ రిమార్కులను వేయిస్తామని చెప్పారు. మహిళా రైతులను పోలీసులు బూటు కాళ్లతో తన్నడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మనుషులా? లేక మృగాలా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? అని అడిగారు. హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించరా? అని అన్నారు.

More Telugu News