Rohit Sharma: పాకిస్థాన్ లో ఆడబోమంటూ బీసీసీఐ చేసిన ప్రకటనపై రోహిత్ శర్మ స్పందన

  • పాక్ గడ్డపై ఆడటంపై బీసీసీఐ నిర్ణయిస్తుందన్న రోహిత్
  • బీసీసీఐ నిర్ణయాన్ని తాము ఆచరిస్తామని వ్యాఖ్య
  • ప్రస్తుతం తమ దృష్టి రేపు పాక్ తో జరగబోయే మ్యాచ్ పైనే అన్న రోహిత్
Rohit Sharma opens up on Indias decision of not travelling to Pakistan

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్ లో ఆడబోమని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. తటస్థ వేదికపైన అయితేనే తాము ఆడుతామని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. ఇలా అయితే భారత్ లో జరిగే ప్రపంచ కప్ లో తాము కూడా ఆడబోమని పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యానించింది. దీనికి సమాధానంగా... మీరు ఆడకపోయినా తమకు ఎలాంటి నష్టం లేదని బీసీసీఐ అంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ అంశంపై స్పందించాడు. 

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో రేపు ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ కీలక మ్యాచ్ జరగబోతున్న తరుణంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ... పాక్ గడ్డపై ఆడటంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని... బీసీసీఐ నిర్ణయాన్ని తాము ఆచరిస్తామని చెప్పాడు. ప్రస్తుతం తమ దృష్టి పాకిస్థాన్ తో రేపు జరగబోయే మ్యాచ్ పై మాత్రమే ఉందని తెలిపాడు. భవిష్యత్తులో జరిగే టోర్నీల గురించి తాము ఆలోచించడం లేదని చెప్పాడు. పాక్ లో జరిగే టోర్నీలో ఆడాలా? వద్దా? అనేది బీసీసీఐ నిర్ణయిస్తుందని తెలిపాడు.

More Telugu News