Karnataka: మరోమారు మునిగిన బెంగళూరు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • గత నెలలో బెంగళూరులో కుంభవృష్టి
  • ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నగరం
  • అంతలోనే మరోమారు కుమ్మేసిన వాన
  • జలమయమైన రోడ్లు, మునిగిన కాలనీలు
Bengaluru under water again as heavy rains trigger waterlogging yellow alert issued

బెంగళూరును వర్షాలు వీడేలా కనిపించడం లేదు. భారీ వర్షాలతో ఇటీవల అతలాకుతలమైన సిలికాన్ సిటీ మరోమారు వరద తాకిడికి గురైంది. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు బీభత్సంగా మారింది. నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా ప్రవహిస్తున్న వరద నీటికి సంబంధించిన వీడియోలు, వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. 

మరోవైపు, వచ్చే మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. తన ఇంటి బేస్‌మెంట్ మునిగిన వీడియోను పోస్టు చేసిన ఓ యూజర్.. ‘ఇది చెరువు కాదు, మా ఇంటి బేస్‌మెంట్’ అని పేర్కొన్నాడు. మరోవైపు, మేజిస్టిక్ వద్ద గోడ కూలిన ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. 

గత నెలలో మూడు రోజులపాటు ఆగకుండా కురిసిన వర్షాలు కర్ణాటక రాజధానిని అస్తవ్యస్తం చేశాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో పలువురు హోటళ్లకు చేరుకున్నారు. దీంతో హోటళ్లలో గదులు అద్దెకు దొరకడం కష్టంగా మారింది. నగరం తిరిగి స్థాధారణ స్థితికి చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న నగరంపై వరుణుడు మరోమారు పగబట్టాడు.

More Telugu News