Telangana: ఉంగరానికి ఓటేస్తే... మునుగోడును అమెరికాలా మారుస్తా: కేఏ పాల్

  • మునుగోడు బరిలో స్వతంత్ర అభ్యర్థిగా కే ఏ పాల్
  • తనకు ఉంగరం గుర్తు కేటాయించారన్న పాల్
  • ఓ హోటల్ లో దోశ వేస్తూ జనంతో మాట్లాడిన వైనం
k a paul campaign in munugode

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారు కూడా తమ తమ స్థాయుల్లో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్ కూడా ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.

బుధవారం మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కే ఏ పాల్... ఓ హెటల్ లో దోశ వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే...అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని చెప్పిన పాల్... ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని ఆయన చెప్పారు. 'ఉంగరం గుర్తుకు ఓటేయండి... మునుగోడును అమెరికా చేసి పారేద్దాం' అంటూ ఆయన తనదైన స్టయిల్లో చెప్పారు. ఓ వైపు పాల్ మాట్లాడుతుండగానే... ఆయన మాటలకు కౌంటర్లు ఇస్తూ జనం కూడా ఉత్సాహం చూపారు.

More Telugu News