Naveen Patnaik: తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికిన ఒడిశా సీఎం

  • తెలంగాణ పర్యటనకు వచ్చిన నవీన్ పట్నాయక్
  • స్వాగతం పలికిన తలసాని 
  • పెట్టుబడిదారుల సదస్సు పాల్గొన్న ఒడిశా సీఎం
Odisha CM Naveen Patnaik invites Telangana and AP investors

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ఫిక్కీ, ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిశాలో పెట్టుబడులకు తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒడిశాలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని వివరించారు. మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్-2022 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. 

ఈ మధ్యాహ్నం సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ చేరుకోగా, బేగంపేట విమానాశ్రయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో ఆయనతో నవీన్ పట్నాయక్ భేటీ లేనట్టేనని తెలుస్తోంది. 

కాగా, పెట్టుబడిదారుల సదస్సులో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ముందంజలో ఉందని కొనియాడారు.

More Telugu News