ప్రభాస్ ‘ఆదిపురుష్’ విషయంలో తన కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు
- టీజర్ చూసి మోసపోయానని విష్ణు చెప్పినట్టు వార్తలు
- అవి కొందరు సృష్టించిన తప్పుడు వార్తలని విష్ణు స్పష్టీకరణ
- తన ‘జిన్నా’ చిత్రం ముంగిట కావాలనే ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని ట్వీట్
‘ఆదిపురుష్ చిత్ర బృందం, ప్రభాస్ ప్రేక్షకులను మోసం చేసినట్టుగా భావిస్తున్నా. ఇలాంటి చిత్రాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రేక్షకులను సంతృప్తి పరిచేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. కానీ, ఆదిపురుష్ టీజర్లో విజువల్స్ కార్టూన్ల మాదిరిగా ఉన్నాయి. సరిగ్గా సన్నద్ధం అవకుండా ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి స్పందనే వస్తుంది’ అని మంచు విష్ణు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆదిపురుష్, టీజర్ విష్ణు ఫొటోలతో కూడిన పోస్టర్ వైరల్ అవుతోంది.
దీన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన విష్ణు.. ‘ఇది ఫేక్ న్యూస్. ఊహించినట్లుగానే, జిన్నా విడుదలకు ముందు కొంత మంది ఐటెమ్ రాజాలు ప్రతికూల వార్తలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్కి బెస్ట్ తప్ప మరేమీ అక్కర్లేదు’ అని విష్ణు ట్వీట్ చేశారు. అలాగే, ‘మా’ సభ్యత్వం కోరే హీరో/ హీరోయిన్ కనీసం రెండు చిత్రాల్లో నటించి అవి థియేటర్ లేదా ఓటీటీలో విడుదల కావాలని తాను ప్రకటించినట్టు వస్తున్న వార్త కూడా కావాలని సృష్టించినదే అన్నారు.